ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.విజయనగరం జిల్లా, ఎస్కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద సోమవారం జగన్ పాదయాత్ర 3,000 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలో 271వ రోజు కొనసాగుతోంది.ఇప్పటి వరకు టీడీపీకే ఉన్న సినీ గ్లామర్ ఇప్పుడు వైసీపీకీ పెరుగుతోంది.
జగన్ పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనను చూసి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారీశ్రాకవేత్తలు ఇప్పటికే పార్టీ కండువా కప్పుకున్నారు.పాదయాత్రలో సినీ ప్రముఖులు కలుసుకున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి జగన్ ను కలుసుకున్నారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు వీరిద్దరూ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ వీరితో కొద్దిసేపు ముచ్చటించారు.
తెలుగు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఆయన వైసీపీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే జగన్ను కలిసినట్లు తెలుస్తోంది.తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. 2014లో యమలీల 2 సినిమా తర్వాత నుంచి ఆయన కొత్త సినిమాలేవీ చేయలేదు. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నారు. తాజాగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా అచ్చిరెడ్డితో కలసి జగన్ను కలిశారు. ఆయన త్వరలో వైసీపీలో చేరే అవకాశాలున్నాయి.