తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) తాజా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నటుడు బాబు మోహన్ టీఆర్ఎస్ పార్టీకి బిగ్షాక్ ఇస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. భాజాపా కండువా కప్పుకొనేందుకు రెడీ అయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా టీఆర్ఎస్ లో కొనసాగుతున్న బాబు మోహన్ కి.. రానున్న ఎన్నికల్లో పార్టీ అధినేత టికెట్ కేటాయించలేదు. ఆందోల్ టికెట్ తనకే దక్కుతుందని బాబు మోహన్ భావించగా.. ఆటికెట్ ను జర్నలిస్టు క్రాంతికి ఇచ్చిన సంగతి తెలిసిందే.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో అందోల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ పై బాబు మోహన్ గెలుపొందారు. అయితే గత నాలుగున్నరేళ్ల కాలంలో ఏర్పడ్డ ప్రజా వ్యతిరేకత, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్ ఇటీవల అసెంబ్లీని రద్దుచేశారు. అంతేకాకుండా 105 మంది అభ్యర్థులను ప్రకటించి కలకలం రేపారు. దీంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ తో కలిసి శనివారం ఆయన ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
కష్టపడి పనిచేసినా కూడా టీఆర్ఎస్ పెద్దలు తనపై వివక్ష చూపుతున్నారని బాబుమోహన్ తన సన్నిహితుల వద్ద విచారం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ టికెట్ నిరాకరిచండంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయనను బీజేపీ నేతలు బుజ్జగించి తమవైపునకు తిప్పుకున్నట్టు తెలుస్తోంది. అందోల్ టికెట్ ఇస్తామని తనకు హామీ లభించడంతోనే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం.