రాజకీయ నేతలు నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో జోష్ మీద ఉన్నారు. తమ పార్టీకే ఓటెయ్యాలంటూ ప్రజల్ని వేడుకుంటున్నారు. ఇక ప్రజలను ఆకర్షించేందుకు ఇరు పార్టీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన మహామహా నాయకులంతా నంద్యాల్లోనే ఉన్నారు. ఇప్పుడు సినీ గ్లామర్ ను కూడా ప్రచారానికి దింపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా కమెడియన్ వేణుమాధవ్ ను దింపింది టీడీపీ.
మొదట్నుంచి వేణుమాధవ్ కి టీడీపీ అంటే ఎనలేని ప్రేమ.గత ఎన్నికల్లో తనకు కోదాడ టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబుని కూడా కలిశాడు వేణు. కానీ అప్పుడు అక్కడున్న పరిస్థితుల కారణంగా ఆయనకు మొండిచెయ్యి చూపించింది టీడీపీ.అయినా పార్టీపై చెక్కుచెదరని ప్రేమతో టీడీపీలోనే కొనసాగుతున్నాడు వేణుమాధవ్.దీంతో నంద్యాల్లో టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు వేణు మాధవ్ ని సంప్రదించగా వెంటనే కారెక్కి వచ్చేశాడు.
సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి అంటూ నంద్యాల ప్రచారంలో ప్రసంగాలు దంచుతున్నడు వేణుమాధవ్.తనకు టీడీపీ,భూమా అంటే అభిమానమని,చంద్రబాబే అభివృద్ధి చేయగలడంటూ తన స్టైల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు వేణుమాధవ్. ఇక వచ్చే ఎన్నికల్లో వేణుమాధవ్ కు టికెట్ ఓకే అయినట్లు అంటున్నారు. ప్రస్తుతం సినిమాలను పూర్తిగా పక్కనపెట్టేసిన వేణుమాధవ్ రాజకీయంగా బలపడాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.
