సార్వత్రిక ఎన్నికలు తెలంగాణాలో కంటే ఏపీలో మరింత రసవత్తరంగా జరగనున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా భీకర యుద్ధం జరుగుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణాలో కాంగ్రెస్తో కూటమిని ఏర్పాటు చేసి ఘోరంగా దెబ్బతిన్న బాబు….అలాంటి తప్పు మరో సారి ఏపీలో చేయకూడదని నిర్ణయం తీసున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్కు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించాలని టీడీపీ చీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు. గత ఎన్నికల్లో కూడ ఇదే రకరమైన నిర్ణయం తీసుకొన్నారు కానీ, ఆచరణలో అది సాధ్యం కాలేదు. ఈ సారైనా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇప్పటికే ఈసీ ప్రకటించింది.
అన్ని నియోజక వర్గాల్లో గెలుపు అభ్యర్థులపై సర్వే నిర్వహిస్తున్నారు. ఆ సర్వే ఆధారంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందుగా ప్రకటించడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. త్వరలో ఎన్నికలున్న నేపధ్యంలో టెలి కాన్పరెన్స్లో ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు బాబు పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు. 2019 టార్గెట్గా బాబు ముందుకెళ్తున్నారు.
ఇక జగన్ విషయానికి వస్తే ప్రజాసంకల్పయాత్ర పేరుతో సంవత్సరానికిపైగా ప్రజల్లో ఉన్నారు. పాదయాత్రలో కొన్ని చోట్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. మిగతా అభ్యర్థుల ఎంపికలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 2014లో జగన్ అప్పటి రాజకీయాలకు ఓ పార్టీ అధినేతగా అంతగా అనుభవం లేని నేత…కానీ ఇప్పుడు మాత్రం రాజకీయాల్లో రాటు దేలారు. పార్టీపైనా, అభ్యర్థుల ఎంపికలో జగన్కు పూర్తి పట్టుంది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ ఏమాత్రం రాజీ పడట్లేదని తెలుస్తోంది. ఇప్పటివరకూ టికెట్ ఇస్తానని ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఆయన స్పష్టమైన హామీ ఇవ్వకుండా స్ట్రాటజీగా ముందుకెళ్తున్నారు. సర్వేల ఫలితాలు, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పార్టీ సమన్వయకర్తల్ని మార్చేస్తున్నారు.
అయితే ఈసారి కొన్ని నియోజక వర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో మాత్రం సిట్టింగులకే ఇస్తారనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా టీడీపీ ఓటమే టార్గెట్గా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపనున్నారు. పాలక పక్షం అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాతే, తమ అభ్యర్థుల జాబితాను జగన్ విడుదల చేస్తారని తెలుస్తోంది.