వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ర్యాలీలో జగన్ మాట్లాడుతూ… రైతుల, పొదుపు సంఘాల, మహిళల రుణాలు మాఫీ చేస్తానని, కాపులను బీసీ జాబితాలో చేర్చుతానని, యువతకు ఉద్యోగాలు ఇస్తానని ఇలా ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు.
చంద్రబాబు నాయుడి రాజకీయ సూత్రాలేంటో మీకు తెలుసా? అని జగన్ ప్రశ్నించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అంతా మోసమని, ఇది తెలుసుకున్న ప్రజలు నిలదీస్తోంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తనకి బాగా తెలిసిన రాజకీయ సూత్రాన్ని చంద్రబాబు పాటిస్తున్నారని అన్నారు. ప్రజలను నమ్మించు, వంచించు అనే సూత్రాన్ని మళ్లీ బయటకు తీశారని, ప్రజలకు ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచి ఆ తప్పును ఇతరుల పైకి నెట్టుతున్నారని విమర్శించారు.
ఆరు నెలలుగా చంద్రబాబు నోటి నుంచి కొన్ని మాటలు వస్తున్నాయని, తనని బలహీనపర్చడం అంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను బలహీన పర్చడమని చంద్రబాబు చెప్పుకుంటున్నారని జగన్ అన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఇలా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.