నంద్యాలలో జరుగుతున్నది ఉప ఎన్నిక మాత్రమే కాదని ధర్మయుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధమని ధ్వజమెత్తారు. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామానికి నంద్యాల ఉపఎన్నికే నాంది కావాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.
2019లో జరగబోయే కురుక్షేత్రం సంగ్రామానికి నాంది ఈ ఎన్నికలు.శిల్పా మోహన్ రెడ్డి తరపున నంద్యాల ఉపఎన్నికలో ప్రచారానికి జగన్ గురువారం శ్రీకారం చుట్టారు. స్ధానిక ఎస్పీజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రజలు ధర్మం పక్షాన నిలబడితే చాలన్నారు. ప్రజలెవరూ యుద్ధం చేయక్కర్లేదని ఓటింగ్ సమయంలో వైసీపీకి మద్దతుగా మీట నొక్కితే చాలు ఈవీఎం అనే విష్ణు చక్రం తిప్పుతూ చంద్రబాబు కౌరవ సామ్రాజ్యం కూకటి వేళ్లతో పెకలించాలి
వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలను ఎత్తుకెళ్లిన చంద్రబాబును దొంగంటారా? లేక ముఖ్యమంత్రంటారా? అంటూ నిలదీసారు. పిల్లనిచ్చిన సొంతమామ ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని, మిగిలిన పార్టీలో చిచ్చుపెట్టే వ్యక్తిని, వాడుకుని వదిలేసే వ్యక్తిని ఏమంటారు అంటూ జగన్ పదే పదే వేసిన ప్రశ్నలకు జనాలు పెద్దఎత్తున స్పందించారు.
వైసీపీ గనుక నంద్యాలలో పోటీ పెట్టకపోతే అసలు ఇక్కడ అభివృద్ధే జరిగేది కాదన్నారు. ఉపఎన్నిక అనివార్యమైన దగ్గర నుండి చంద్రబాబునాయుడు, లోకేష్ ఇద్దరూ నంద్యాల వీధుల్లోనే తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేసారు.
చంద్రబాబు పాలన ఎలాగుందో జనాలనే అడిగి చెప్పించారు. అవినీతి, అక్రమాల చంద్రబాబు ప్రభుత్వాన్ని దింపేయాల్సిన సమయం దగ్గరకు వచ్చిందన్నారు
మైనారిటీలకు మూడేళ్ళుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని ఆరోపించారు. రైతులకు రుణమాపీ చేయకుండా వెన్నుపోటు పొడిచినట్లు ధ్వజమెత్తారు. డ్వక్రా మహిళలనే కాదు సమాజంలోని ప్రతీ వర్గాన్నీ చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారన్నారు.
తన పాలనపై నమ్మకం లేని చంద్రబాబు నంద్యాల ఎన్నికలు వచ్చేసరికి పవన్ కల్యాణ్ ను పిలిపించుకుంటున్నారని జగన్ ఎద్దేవ చేశారు. చిన్న పిల్లలను సైతం వదలకుండా వెన్నుపోటు పొడిచే రకం చంద్రబాబని నిప్పులు చెరిగారు.