రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఒక పక్క వలసలు..మరో పక్క సవాల్లతో ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. ఎండాకాలంలో ఎండలు ఏమో గాని రాజకీయ వేడి ముందు ఎండలు కూడా చిన్నబోతున్నాయి. కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ తాజాగా చంద్రబాబుకు దమ్మున్న సవాల్ విసిరారు.
బాబు సురక్షితమైన నియోజకవర్గాన్ని చూసుకుని తన కుమారుడు లోకేశ్ను ఓడిపోయే భీమిలికి పంపుతున్నారని ఆయన విమర్శించారు. దమ్ముంటే చంద్రబాబు భీమిలి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబు లేదా లోకేశ్ ఎవరు పోటీచేసినా గెలుపు తనదేననని మీసం మెలేశారు. టీడీపీ హయాంలో ఓ సామాజికవర్గానికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారన్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ను తిట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పుడు కమలం పార్టీని తిడుతూ హస్తంతో జతకడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మొదటినుంచి వైసీపీనే పోరాడుతోందని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా బాబు ఎన్ని సార్లు యూటర్న్ తీసుకున్నారో అందరికి తెలుసునన్నారు.జగన్ సీఎం అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.