ఫార్టీ ఫిరాయించి టీడీపీలో మంత్రిగా ఉన్న అమరనాథ్రెడ్డి, చంద్రబాబులపై వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్ పై ప్రేమతో, వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో ప్రజలందరూ అమర్ నాథ్ రెడ్డిని గెలిపిస్తే వాళ్లనమ్మకాన్ని వొమ్ముచేసి పార్టీ ఫిరాయించి మంత్రిపదవిలో కొనసాగుతున్నారని విమర్శించారు.
అమరనాథ్రెడ్డి టీవీలో ఎప్పుడూ మీసాలు తిప్పడం తప్ప పలమనేరుకుగానీ, చిత్తూరుకుగాని చేసిందేమిలేదన్నారు. గడ్డం చంద్రబాబుకు ఈ మీసాలు ఆయన తోడయ్యారని ఎద్దేవ చేశారు. ఆ గడ్డం ఆయన కుప్పానికి ఏం చేయడు, ఈ మీసాలు ఆయన పలమనేరుకు ఏమీ చేయడు. ఇద్దరూ కలిసి చిత్తూరు జిల్లాకు ఏమీ చెయ్యరని రోజా ఫైర్ అయ్యారు.
చిత్తూరు ప్రాంతం అభివృద్ధికోసం ఒక్క ప్రాజెక్ట్ గానీ, పరిశ్రమగానీ తీసుకురాలేదన్నారు. పేపరు మీద మాత్రమే అమర్ నాథ్ రెడ్డి మంత్రి. చంద్రబాబునాయుడుకు, లోకేశ్ కు ఓ రబ్బరు స్టాంపులా ఉన్నాడే తప్పా, స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశం ఆయనకు లేదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1వ ర్యాంకులో ఉన్న ఏపీ, అమర్ నాథ్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి అయిన తర్వాత 14వ స్థానానికి పడిపోయింది’ అని రోజా విమర్శించారు.