ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. బాబు చేసిన దీక్ష ధర్మదీక్ష కాదని నయవంచన దీక్ష అని ఎద్దేవ చేశారు. నరేంద్ర మోదీ వచ్చి మట్టి, నీరు ఇచ్చిన వేళ, జగన్ అక్కడ లేరని, వాటిని రెండు చేతులతో మహా ప్రసాదంగా తీసుకున్న చంద్రబాబు ఓ దద్దమ్మ అయితే, ఆయన పక్కనే ఉన్న దేవినేని మరో దద్దమ్మని విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన చేస్తున్న వేళ, ప్రతిపక్ష నాయకుడిని పిలవకుండా వాళ్లింటి పేరంటంలా చేసుకుని సిగ్గు లేకుండా ప్రవర్తించిన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. అందరూ ఏప్రిల్ 1 పూల్ చేస్తే బాబు ప్రజలను ఏప్రిల్ 30న పూల్ చేశారని ఎద్దేవ చేశారు.
నాడు మట్టి, నీటిని కళ్లకు అద్దుకుని హెలికాప్టర్ ఎక్కి చంద్రబాబు చల్లుతుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు గాడిదలు కాస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. టీడీపీ వారు చేసిన పాపాలు పండే సమయం వచ్చిందని రోజా అన్నారు. చంద్రబాబు చేసిన కుంభకోణాల్లో ఏ ఒక్కటి విచారణకు వచ్చినా, జీవితాంతం జైల్లో ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
వంచన చేసిన వారే ధర్మపోరాటం అంటూ మరో కుట్రకు తెరలేపారని, ప్రజలను మభ్యపెట్టేందుకు జరుపుతున్న చంద్రబాబు మోసపు దీక్షల గురించి ప్రజలకు తెలుసునని రోజా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయిస్తే చంద్రబాబు, లోకేష్లు ఊచలు లెక్కపెట్టాల్సిందేన్నారు.