టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. జగన్పై దాడి కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తే అసలు నిందితులు బయటపడతారనే ఉద్దేశ్యంతోనే కేసు వివరాలను ఇవ్వలేదని మండిపడ్డారు. దాడి ఘటన జరిగిన తర్వాత టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఇప్పుడు మాత్రం వణికో పోతున్నారని ఎద్దేవ చేశారు. ఎటువంటి తప్పు చేయకుంటే ఎన్ఐఏ అధికారులకు వివరాలు ఇవ్వడానికి చంద్రబాబు లోకేష్ ఎందుకు భయపడుతున్నారని రోజా ప్రశ్నించారు. ఘటన అనంతరం కొద్ది గంటల్లోనే టీడీపీ నేతలు నిందితుడు శ్రీనివాసరావు-జగన్ ఫొటోలతో నకిలీ ప్లెక్సీలను రూపొందించారని విమర్శించారు.
నటుడు శివాజీతో ఆపరేషన్ గరుడ అనే కట్టుకథ అల్లించి…అందులో జగన్ పై దాడి జరుగుతుందని చెప్పించారని… అదే జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు శివాజీనీ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. హైకోర్టు ఎన్ఐఏకు కేసును అప్పగించిందన్నారు. కానీ ఈ వ్యవహారంలో చంద్రబాబు తీరు మాత్రం ‘ఈ 13 జిల్లాలకు భారత రాజ్యాంగం వర్తించదు. ఇక్కడ నారా రాజ్యాంగం నడుస్తోంది’ అనే రీతిలో ప్రవర్తిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
జగన్పై దాడి కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తే చంద్రబాబు, లోకేష్, శివాజీ బాగోతం బయటపడుతుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీలసుపై అంత నమ్మకం ఉంటే కేంద్రం ఇచ్చిన జడ్ ప్లస్ కేటగిరీ సెక్కూరిటీని ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆర్థిక నేరగాళ్లకు అడ్డాగా మార్చేశారని విమర్శించారు. టీడీపీ నేతలు పరిటాల రవి, మాధవరెడ్డి హత్య కేసులను తిరిగి దర్యాప్తు చేస్తే వారికి చంద్రబాబు ఉన్నాడనే విషయం బయటపడుతుందని ఆరోపించారు. బాబుపై ఉన్న కేసుల్లో ఏ ఒక్క కేసు విచారణ జరిగినా ఆయన జీవితాంతం జైల్లోనే ఉంటారని ఎద్దేవ చేశారు.