చంద్రబాబు స్లీపింగ్ ప్రెసిడెంట్.. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని. రాష్ట్రాన్ని దోచుకునే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నాడు …అందుకే లోకేష్ను టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ను చేసినట్లున్నారు అని చురకలు అంటించారు.
ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు మరియు రాజకీయ కక్షసాధింపు చర్యల వల్ల వారు భవిష్యత్తులో తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేస్తూ ‘రెడ్ బుక్’ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది మత్స్యకారుల పొట్ట కొట్టడమేనని ఆరోపించారు. “ఏ ప్రైవేట్ కంపెనీకి ఇస్తారో ఇచ్చుకోండి.. మా ప్రభుత్వం వచ్చాక పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి” అని ఆయన హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు దక్కాల్సిన గుర్తింపును కూడా చంద్రబాబు, లోకేశ్లు లాగేసుకుంటున్నారని, ఆయనను కేవలం ‘ఆటలో అరటిపండు’లా వాడుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చివరకు పవన్ నెత్తిన స్కామ్లు మోపే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.
