ఏపీ కేబినెట్ కూర్పు దాదాపు ఖాయమైంది. ఉదయం తాడేపల్లిలోని జగన్ కార్యాలయంలో జరిగిన వైసీపీ ఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం తీసుకున్నారు. అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని కేబినేట్ను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా తీసుకోవడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. రేపు ఉదయం 25 మందితో జగన్ కేబినేట్ కొలువు తీరనుంది. మంత్రి వర్గంలోకి తీసుకుంటున్న వారికి విజయసాయిరెడ్డి ఫోన్లు చేస్తారని జగన్ స్పష్టం చేశారు.
దీనిలో భాగంగానె విజయసాయిరెడ్డి నేతలకు ఫోన్ చేసినట్లు సమాచారం.మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే నేతలతో మాట్లాడిన జగన్..ఏ ప్రాతిపదికన మంత్రి పదవి ఇవ్వబోతున్నది వివరించారు. 25 మందితో పూర్తిస్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఈ ఎనిమిది మందికి కేబినెట్ బెర్తులు ఖాయమైనట్లు సమాచారం.
కొలువు దీరనున్న కొత్త మంత్రి వర్గంలో ఎవరికి స్థానం దక్కనుందో అన్న విషయమై వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, సుచరిత, పెద్దిరెడ్డి, గౌతమ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , కొడాలి నాని, పార్థసారధికి ఇప్పటికే వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఫోన్ కాల్స్ చేసినట్టు సమాచారం. కొత్త మంత్రి వర్గంలో వీరికి అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆయా నేతల నివాసాల మధ్య అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.