రిలయన్స్ జియో ఇచ్చిన షాక్ తో 4జీ సేవలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో అన్ని టెలికం కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి క్రమంలో భారత టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. మరో మూడు, నాలుగేళ్లలోపు 2జీ, 3జీ సేవలను కంప్లీట్ గా రద్దు చేయబోతున్నట్లు తెలిపింది.
వాటి స్థానంలో 4జీ సర్వీసులను జతచేస్తామని ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే 3జీ సర్వీసులపై ఎలాంటి ఖర్చులు చేయడం లేదని ప్రకటించింది. తమ నెట్వర్క్ లో డేటా సామర్థ్యాన్ని మరింత అభివృద్ది చేయడం కోసం 4జీ టెక్నాలజీపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్లు భారతీ ఎయిర్ టెల్ దక్షిణాసియా, ఇండియా సీఈవో, ఎండీ గోపాల్ విట్టల్ వెల్లడించారు. ప్రస్తుతం 3జీ, 4జీ సర్వీసుల కోసం 2100 మెగా హెర్ట్జ్ బ్యాండ్ లను వాడుతున్నామని… తమ స్పెక్ట్రమ్లో ఎక్కువ భాగాన్ని 4జీ సర్వీసులకే కేటాయిస్తున్నామని తెలిపారు.
కొన్ని టెలికాం సర్కిళ్లలో అత్యాధునిక 3జీ పరికరాలను అమరుస్తున్నామని.. వాటికి 4జీ సపోర్ట్ చేస్తున్నామని వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఎయిర్టెల్లో 3జీ సేవలను వాడుతున్నవారు.. ఇక వాటిని పక్కనబెట్టి 4జీ కెపాసిటీ గల స్మార్ట్ ఫోన్లను తీసుకోవాల్సి ఉంటుంది.