రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. రాష్ట్రంలో మైండ్గేమ్తో పార్టీలను దెబ్బకొట్టాలని ముఖ్య నేతలు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబుదే పై చేయి అని చెప్పాలి. ఎందుకంటే ఆయన వద్దే అస్త్రశస్త్రాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఆయన ముఖ్య అస్త్రం మీడియా. ఆయన టెలీ కాన్ఫరెన్స్లో పిచ్చా పాటీగా మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆయన బహిరంగంగా ఏదీ మాట్లాడరు.. అన్ని టెలికాన్ఫరెన్స్లు.. కార్యకర్తలతో సమావేశాలే.
ఇక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మీడియా ప్రచారానికి పదును పెట్టారు చంద్రబాబు. ప్రజామద్దతును పక్కన పెడితే.. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి తన బలం ఎక్కువే అనుకోవాలి.. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీని విచ్ఛిన్నం చేస్తూ.. ప్రతిపక్ష నేతలను ప్రజల్లో చులకన చేస్తూ.. వారి మధ్య చిచ్చులు పెట్టేలా చేస్తే తన పని ఇంకాస్త సులువు అవుతుందనుకున్నారేమో.. ఇప్పుడదే పనిలో పడ్డారు.
వైఎస్ఆర్సీపీలో డబ్బులు ఎక్కువ ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తారంటూ కొత్త ప్రచారానికి తెర లేపింది చంద్రబాబు అనుకూల మీడియా. ఆయన ఏ టెలికాన్ఫరెన్స్లో అన్నారో తెలియదు కానీ.. ఆయన పేరుతో అన్ని ఛానళ్లలో వచ్చేస్తోంది ఈ వార్త. అది ఆయన నిజంగా అన్నారో లేదో తెలీయదు మరి. ఇక వైఎస్ఆర్సీపీలో కీలక నేతల అలకల బాట పట్టారు.. జగన్ ఓ నియంత.. జగన్ డబ్బుకే ప్రాధానిమిస్తారు.. జగన్ అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి వార్తలు కోకోల్లలు. ఇప్పుడు ఏ సైట్ ఓపెన్ చేసినా.. ఏ ఛానల్ పెట్టినా ఇవే వార్తలు కనిపిస్తాయి.. వినిపిస్తాయి.
ఇటీవలే గౌర చరిత దంపతులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. తమకు టికెట్ ఇవ్వనందుకే పార్టీకి రాజీనామా చేశామని ఆ దంపతులు ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. తాము టీడీపీలో చేరబోతున్నామని ప్రకటించేశారు కూడా. ఇక్కడ గౌరు దంపతులను టీడీపీలో చేర్చుకొని టికెట్ ఇవ్వడానికి ప్రధాన కారణం జగన్పై ఉన్న కోపమే అని చెప్పుకోవాలి. ఇక ఈ అంశాన్ని అన్ని ఛానళ్లలో ప్రదర్శించే తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ఇటీవల పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీని వదిలి.. వైఎస్ఆర్సీపీలో చేరారు. మరి అప్పుడు ఈ మీడియా సంస్థలు ఎక్కడ ఉన్నాయో వారికే తెలియాలి. అలా ఉంటుంది టీడీపీ మీడియా స్ట్రాటజీ.
ఇక ప్రతిపక్ష పార్టీలోని కీలక నేతలపై కేసులు పెట్టడం.. లేదా నియోజకవర్గంలో వారికి కాకుండా వేరోకరికి టికెట్లు ఇస్తున్నారంటూ ప్రచారం చేయడం ప్రారంభించేశారు. దీంతో కొందరు నేతలు కీలక సమయాల్లో మౌనం వహిస్తున్న పరిస్థితి. మరి జగన్ ఈ పరిస్థితులను గెలవగలరో లేదో చూడాలి.
ఏదేమైనా ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. కనికట్టు విద్యలతో మాయ చేసే చంద్రబాబును ఎదుర్కోవడం జగన్కు సాధ్యమేనా? అనుకూల మీడియా ట్రాప్లో పడి జగన్ కట్టు తప్పుతారా? చంద్రబాబు సృష్టించే అవరోధాలను దాటుకుంటూ జగన్ ఎన్నికలను గెలవగలరా? ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.