ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులలో దివంగతనేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యత విశిష్టమైనది. పలు సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిల్చిన మహానేత ఆయన. అందరు సీఎంలు కాంగ్రెస్ అధిష్టానం ఆడించినట్లా ఆడినవారే. కానీ వైఎస్ఆర్ మాత్రం ఢిల్లీనీ గడగడలాంచిన నేత. ఢిల్లీ రాజకీయాలను శాసించిన ధీశాలి.
2004 లో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడతున్న కాంగ్రెస్ ఊపిరి పోసిన మహానేత. వై.యస్. రాజశేఖరరెడ్డి 2003 వేసవి కాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. ఆ పాదయాత్రే కాంగ్రెస్ తలరాతను మార్చడంతోపాటు వైఎస్కు వ్యక్తిగతంగా జనాధరన పెరింది.
2004 మే నెలలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో అప్పటికే పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. సీఎంగా ఎవరుండాలనే అధిష్టానం సంసృతిని తిరగరాసిన నేత. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఉచిత కరెంటు ఫైలుపై సంతకం పెట్టి చరిత్ర సృష్టించారు.
వైఎస్ఆర్ ప్రజాధరన గురించి చెప్పాల్సిన పనిలేదు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. పరిపాలనా అంటే ఎలా ఉండాలో నిరూపించిన నాయకుడు. జనం మెరుగైన జీవితాన్ని సాగించడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించిన వాడే రాజకీయ నాయ కుడు . పరిస్థి తుల్ని, వ్యక్తుల్ని, సమాజాన్ని పురోగమనం వైపు మార్చడంపై ఆలోచించి, ఆచరించిన దార్శనికుడు, ఉదారవాది, జనరంజక పాలకుడు, జనాకర్షక నాయకుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచి పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయనొక ధృవతార.
జన ఆకాంక్షలకు ఆయనొక ప్రతీక. జనం గుండెల్లో ఎన్నటికీ చెరపలేని ముద్ర ఆయనది. నమ్మకం ఆయన ఇంటిపేరయింది. సంక్షేమం ఆయన నిరంతరం ఆలోచించే ‘నిరుపేదల పేరు’ అయింది. ఆయన అనుకుంటే కాంగ్రెస్ మరణశయ్య నుంచి ఏపీలో లేచి కూచుంటుంది. ఆయన నవ్వుతూ చేయి ఊపితే గెలువలేని నేత కూడా గెలిచి కూర్చుంటాడు. ఆయన కృషితో కేంద్రంలోనే పార్టీ అధికారంలో కూర్చుంటుంది. ఆయన ఆదేశిస్తే జనం కోసం రిలయన్స్ వంటి బడాబాబులూ, మోన్శాంటో వంటి విత్తనాధిపతులూ మెడలు దించాల్సిందే.
ఒక్క బిడ్డయినా చదువుకోలేదంటే ఆయన కంట్లో కన్నీళ్లు కారతాయి. ఒక్క మనిషైనా వైద్యం పొందలేకుంటే ఆయన గుండె తరుక్కుపోతుంది. ఒక నోట్లో ముద్ద పడకున్నా ఆయన çహృదయం అల్లాడి పోతుంది. ఒక్క రైతు అప్పులతో సతమతమవుతున్నా ఆయన మనస్సు గిలగిలా కొట్టుకుంటుంది. ఒక్క రైతుకు సాగునీరు లేకున్నా, కరెంటు లేకున్నా, గిట్టుబాటుధర, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లేకున్నా ఆయన కుదురుగా కూర్చోలేడు. ఒక్క పేద మహిళకు పావలా వడ్డీకి రుణం అందకున్నా ఆయన ఆవేదన ఆపలేనిద వుతుంది.
పార్టీలకు అతీతంగా, ప్రభుత్వ పథకాల మేళ్లు ఓ ఒక్కరికి అందకున్నా ఆయన అధికారులను పరుగెత్తిస్తాడు. అది విద్యా సమస్యా, వైద్య సమస్యా, రైతు సంక్షేమమా, మహిళాభివృద్ధా, యువతకు ఉద్యోగ, ఉపాధులా, వృద్ధులు, దివ్యాం గులు, వితంతు పింఛన్లు వంటి అవసరాలా ఇంకేదైనానా అనే దాంట్లో తేడా ఉండదు.
2009 ఎన్నికలకు ముందు అన్ని ప్రతి పక్షాలు ఒకవైపు, మరోవైపు సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం ఇవి ఏవీ రాజశేఖర్ రెడ్డి ప్రాభవాన్ని అడ్డుకోలేక పోయాయి. మళ్ళీ 2009 ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. దురదృష్టశాత్తు రెండవసారి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి అదే సంవత్సరం సెప్టెంబరు 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. నేడు రాజశేఖర్ రెడ్డి తొమ్మిదవ వర్థంతి. ఇలాంటి నేతలు యుగానికొక్కడు జన్మిస్తుంటారు.