రాజన్నరాజ్యం కోసం రాష్ట్రంలో జూలై 8న పార్టీ పేరు, అజెండా ప్రకటిస్తానని సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రకటించింది. అదే రోజున పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తాను స్థాపించబోయే పార్టీ పేరును షర్మిల ఇవాళ ఖమ్మం సభలో ప్రకటిస్తారని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు. జనం తరఫున పాలక పక్షాన్ని ప్రశ్నించే బలమైన గొంతుగా మన పార్టీ ఉంటుంది.
తెరాస, భాజపా, కాంగ్రెస్ పంపితే మేం రాలేదు. సింహం సింగిల్గానే వస్తోంది. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై వస్తున్నా. మేం ఏ పార్టీ కిందా పనిచేయం. పదవులు వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాం. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తామని మాటిస్తున్నా.. మా సంకల్పానికి మీ ఆశీస్సులు అవసరం. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు. అధికార పార్టీకి భయపడొద్దు.
ప్రజల పక్షాన పోరాటాలు చేయండి.. కష్టమొస్తే అండగా నిలబడతా. రాజన్న నుంచి సంక్రమించిన ధైర్యముంది. చేయిచేయి కలిపి రాజన్న పాలన తీసుకొద్దాం అని పిలుపునిచ్చారు. 18 ఏళ్ల కిందట ఏప్రిల్ 9వ తేదీన చేవెళ్ల నుంచి వైఎస్సార్ ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించిన రోజునే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం శుభసూచకమన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు.
బరాబర్ తెలంగాణలో నిలబడతానని, తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్లాడతానని షర్మిల ఉద్ఘాటించారు. ప్రతి రైతు రాజు కావాలని కోరుకున్న నాయకుడు వైఎస్ఆర్ అని, ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన చేసింది వైఎస్ఆరేనని గుర్తుచేశారు. కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలని జలయజ్ఞానికి వైఎస్ఆర్ శ్రీకారం చుట్టారని, వ్యవసాయాన్ని పండగ చేయాలని, మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్ఆర్ కలలు కన్నారన్నారని అన్నారు.
ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఎవరికి ఇష్టమున్నా.. లేకపోయినా తాను తెలంగాణ బిడ్డనే అని షర్మిల చెప్పారు. ఈ గడ్డమీదే బతికానని.. ఇక్కడి నీరే తాగానన్నారు. తన కుమారుడు, కుమార్తెను తెలంగాణ గడ్డపైనే కన్నానని చెప్పారు. ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని అనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. బరాబర్ తెలంగాణ కోసం నిలబడతా అని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం కొట్లాడతానని.. అవకాశం ఇవ్వాలో వద్దో వాళ్లే నిర్ణయిస్తారన్నారు.
కరోనా.. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవ్: హైదరాబాద్ పోలీసులు
డేంజర్ బెల్.. తెలంగాణలో కొత్తగా 2,909 మందికి కరోనా!
హెల్మెట్తో ఓటు వేసిన నాయకుడు.. ఎందుకంటే..?