తనను శ్రీలంక వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి తప్పించడంపై ఏంజెలో మాథ్యూస్ ఆవేదన వ్యక్తం చేశాడు. యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ లో శ్రీలంక లీగ్దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక బోర్డు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ పై వేటు వేసింది. వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఆసియాకప్లో తమ జట్టు లీగ్ దశ నుంచే నిష్ర్కమించడాన్ని సాకుగా చూపుతూ వన్డే కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. శ్రీలంక జట్టు ఓవరాల్ ప్రదర్శనకు తనను బలి పశువును చేశారని మాథ్యూస్ విమర్శించాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో జట్టు సమష్టిగా విఫలమైందనీ, దీనికి తానెలా బాధ్యుడిని అవుతానని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో మాథ్యూస్ ను తొలగించడంతో అతను బోర్డుకు లేఖ రాశాడు. అయితే ఈ వివాదంపై స్పందించిన శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టు వైఫల్యం కారణంగా కెప్టెన్ ను మార్చలేదని స్పష్టం చేసింది. త్వరలో జట్టు ఇంగ్లండ్ లో పర్యటించనున్న నేపథ్యంలో టీ20, వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీ బాధ్యతలను దినేశ్ చండీమాల్ కు అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.