టీమిండియా క్రికెటర్ల వార్షిక వేతనాలు భారీగా పెరగనున్నాయి. బీసీసీఐ త్వరలోనే ఆటగాళ్లకు శుభవార్త తెలపనుంది. భారత పురుషుల, మహిళల జట్టుతో పాటు దేశవాళి, అండర్-19 క్రికెటర్ల జీతాలు పెరగనున్నాయని బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ చానెల్కు తెలిపారు. దీనికి సంబందించిన ప్రక్రియ దాదాపు పూర్తైందని.. సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆ అధికారి వెల్లడించారు.
గతంలో కూడా క్రీడాకారుల జీతాలు పెంచాలని కెప్టెన్ విరాట్తోపాటు ధోనీ, కోచ్ రవిశాస్త్రిలు బీసీసీఐ,పాలకుల కమిటీతో చర్చించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే జీతాల పెంపునకు పూనుకుంది. సుమారు 25 మంది క్రికెటర్లను ఏ,బీ, సీ మూడు కేటగిరీలుగా విభజించి వార్షిక కాంట్రాక్టులు అమలు చేయనున్నారు. జీతాల పెంపునకు ఆర్థిక కమిటీ ఆమోదం తెలుపడమే తరువాయి ఐపీఎల్ కన్నా ముందే ఆటగాళ్లకు కాంట్రాక్టులను ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది.
ఏడాదికి గ్రేడ్-ఏ క్రికెటర్లకు దాదాపుగా రూ.12కోట్లు, బి-గ్రేడ్ రూ.8 కోట్లు, సీ-గ్రేడ్ నాలుగు కోట్లు ఇవ్వనున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆటగాళ్లకు ఏ స్థాయి గ్రేడ్ ఇవ్వాలనేదాన్ని నిర్ణయిస్తుంది.