సాయంత్రం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఉదయం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ తో ఈ వార్తలు షికారు చేశాయి. ఇటీవల వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ.. మిన్నకుండిపోయిన ఈ మాజీ కెప్టెన్ ఈరోజు రాత్రి 7 గంటలకి మీడియాతో మాట్లాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో ధోని ప్రెస్ మీట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రికెట్ అభిమానులపై ధోని రిటైర్మెంట్ బాంబ్ పేల్చనున్నాడని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఎలాంటి సంచలన నిర్ణయం ప్రకటించకూడదని ధోని అభిమానులు కోరుకుంటున్నారు. ధోని మరికొంత కాలం క్రికెట్ ఆడాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
అయితే ఈ వార్తలపై బీసీసీఐ ఘాటుగా స్పందించింది.ఈ వార్తలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపింది. ధోనీ రిటైర్మెంట్ పై తమకు ఎలాంటి సమాచారం లేదని చిఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపడేశారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన సందర్భంగా ఎమ్మెస్కే క్లారిటీ ఇచ్చారు.