ఒకప్పుడు వన్డేలలో సెంచరీ చేస్తే గొప్ప.రాను రాను ఈ సెంచరీలు కాస్తా డబుల్ సెంచరీలుగా మారాయి.టీ -20లు వచ్చాకా క్రికెట్లో వేగం పెరిగిందనేది అందరికి తెలిసిందే.టీ-20లో సెంచరీలు చాలా అరుదుగా నమోదు అవుతుంటాయి.కాని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వచ్చిన తరువాత టీ -20లలో కూడా సెంచరీలు మంచినీళ్ల ప్రాయంలా మారాయి.తాజాగా టీ- 20లలో కూడా డబుల్ సెంచరీ నమోదు కావడం సంచలనంగా మారింది.భారత సంతతికి చెందిన ఓ ఆటగాడు క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు.భారత్కు చెందిన 19 ఏళ్ల కేవీ హరికృష్ణన్ యూఏఈ అండర్-19 జట్టులో సభ్యుడు.
అయితే ఇతడు క్లబ్ క్రికెట్ టోర్నీలో భాగంగా స్పోర్టింగ్ టీమ్ తరపున బరిలోకి దిగిన అద్భుతాన్ని సృష్టించాడు. మాచోస్ జట్టుతో టీ20 మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగిన హరికృష్ణన్ కేవలం 78 బంతుల్లోనే 208 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. ఇతడు ఆరంభంనుండి బౌండరీలతో రెచ్చిపోతూ ఏకంగా 22 ఫోర్లు, 14 సిక్సర్లు బాదాడు. హరికృష్ణన్ ద్విశతకం సాధించడంతో స్పోర్టింగ్ క్లబ్ జట్టు 20 ఓవర్లలో 250 పరుగులు చేసింది. భారీ స్కోరును సాధించినప్పటికి బౌలర్లు విఫలమవడంతో హరికృష్ణన్ సెంచరీ వృధా అయ్యింది.టీ20 లో డబుల్ సెంచరీతో రికార్డును నెలకొల్పిన హరికృష్ణన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.