వన్డేల్లో భారత జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగింది. దక్షిణాఫ్రికా సిరీస్లో సునాయాస విజయంతో శుభారంభం చేసింది. గురువారం ఇక్కడ కింగ్స్మీడ్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 6 వికెట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (120) సెంచరీ సాధించాడు. కుల్దీప్ 3, చహల్ 2 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరు 20 ఓవర్లలో కేవలం 79 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయడం సఫారీల పతనాన్ని శాసించింది.
అనంతరం భారత్ 45.3 ఓవర్లలో 4 వికెట్లకు 270 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ కోహ్లి (119 ) వన్డేల్లో 33వ శతకం సాధించగా అజింక్య రహానే (86 ) నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్ ఆడి తన ఆటపై ఉన్న అనుమానాలను తొలగించాడు. ప్రస్తుతం సిరీస్లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా ఆదివారం సెంచూరియన్లో రెండో వన్డే జరుగుతుంది. ఈ గెలుపుతో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా వరుస 17 విజయాలకు భారత్ బ్రేక్ వేసింది.