భారత పరుగుల యంత్రం, కింగ్ కోహ్లీ త్వరలో పెళ్లి పీటలెక్కపోతున్నాడు. తన ప్రేయసి, బాలీవుడ్ భామ అనుష్క శర్మను కోహ్లీ వచ్చే వారం వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. శ్రీలంకతో టెస్టు సిరీస్కే కోహ్లీ దూరం అవుతాడని, అది పెళ్లి కోసమే అని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అప్పట్లో అనుష్క శర్మ ఖండించింది. అంతేకాకుండా కోహ్లీ శ్రీలంకతో పూర్తి టెస్టు సిరీస్ ఆడాడు.
తాజాగా బీసీసీఐ శ్రీలంకతో వన్డే, టీ20 కోసం ప్రకటించిన జట్టులో విరాట్ ను సెలెక్ట్ చేయలేదు. ఐపీఎల్ నుంచి కోహ్లీ వరుసగా క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. త్వరలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అందుకే విరాట్కు విశ్రాంతి కల్పించాం అని బీసీసీఐ తెలుపుతోంది. మరో పక్క మాత్రం వచ్చే వారం కోహ్లీ.. తన ప్రేయసిని పెళ్లాడేందుకే సెలవలు తీసుకున్నాడని తెలుస్తోంది.
డిసెంబరు 9, 10, 11, 12 తేదీల్లో ఇటలీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనున్నట్లు సమాచారం. ఇందుకోసం కోహ్లీ గురువారం ఇటలీకి బయలుదేరనున్నాడట. ఇప్పటికే కోహ్లీ కుటుంబసభ్యులు, స్నేహితులు పెళ్లి కోసం టిక్కెట్లు కూడా బుక్ చేసేసుకున్నారట. ఇటలీలో జరిగే పెళ్లితంతుకు ఏ క్రికెటర్ హాజరుకావడంలేదు. క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా డిసెంబరు 21న ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేసిన్నట్లు సమాచారం. ఈ పెళ్లి వార్తలపై ఇరువురి కుటుంబసభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.