టీమిండియా మాజీ కెప్టెన్, తాజా కెప్టెన్ల మధ్య పోరును ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా అభిమానులు వీక్షించవచ్చు. ఒకరు మిస్టర్ కూల్ క్రికెటరే కాదు.. కూల్ కెప్టెన్గానూ ఫేమస్. మరోవైపు మిస్టర్ అగ్రెసివ్ ప్లేయర్, అగ్రెసివ్ కెప్టెన్గా విరాట్ కోహ్లికి పేరుంది. వీరిద్దరూ ప్రత్యర్థులుగా మారి నేడు (బుధవారం) బరిలోకి దిగనున్నారు.
ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బుధవారం రాత్రి 8 గంటలకి మ్యాచ్ జరగనుంది. సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిల మధ్య పోరు అనగానే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లాడిన బెంగళూరు జట్టు కేవలం రెండింటిలో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానం ఉండగా.. ఆడిన ఐదు మ్యాచ్ల్లో.. నాల్గింటిలో గెలుపొందిన చెన్నై జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది.
చిన్నస్వామి స్టేడియం సీట్ల సామర్థ్యం దాదాపు 40 వేలు. కాగా ఆదివారం 25 వేల టికెట్ల అమ్మకాలు చేపట్టగా.. కేవలం గంట వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో మ్యాచ్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విరాట్ కోహ్లి టీమిండియాకు కెప్టెన్ అయినప్పటికీ మాజీ కెప్టెన్ ధోని సలహాలతో జట్టును నడిపిస్తున్నాడు.
మరోవైపు ఐపీఎల్లో చెన్నై జట్టుపై అంతగా రికార్డు లేకున్నా సొంత మైదానంలో బరిలో దిగడం బెంగళూరుకు కలిసొచ్చే అంశం. మిస్టర్ కూల్ పైచేయి సాధిస్తాడా లేకా దూకుడు ప్రదర్శించే విరాట్ పైచేయి సాధిస్తారో చూడాలి.