కేరళ క్రికెట్ లీగ్ 2025లో వండర్ జరిగింది. 28 ఏళ్ల సల్మాన్ నిజార్ చివరి రెండు ఓవర్లలో 11 సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్గా మారింది.
కేరళ క్రికెట్ లీగ్ 2025లో భాగంగా త్రివేండ్రం రాయల్స్, కాలికట్ గ్లోబ్స్టార్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలికట్ గ్లోబ్స్టార్స్ 18 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. అయితే చివరి రెండు ఓవర్లలో అద్భుతం చేశాడు నిజార్. బాసిల్ థంపి వేసిన 19 ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఆఖరి బంతికి సింగిల్ తీసి మరుసటి ఓవర్కు స్ట్రైకింగ్ లో ఉండేలా చూసుకున్నాడు. ఈ ఓవర్లో మొత్తంగా 31 పరుగులు వచ్చాడు.
చివరి ఓవర్ను అభిజిత్ ప్రవీణ్ వేశాడు. ఈ ఓవర్లో సల్మాన్ ఆరు సిక్సర్లు కొట్టి 40 పరుగులు రాబట్టాడు. ఇలా కాలికట్ జట్టు చివరి 12 బంతుల్లో 71 పరుగులు చేసింది. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో ఆఖరి రెండు ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. కాలికట్ గ్లోబ్స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సల్మాన్ నిజార్ (86 నాటౌట్ 26 బంతుల్లో 12 సిక్సర్లు) రాణించాడు.
అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన త్రివేండ్రం రాయల్స్ జట్టు 19.3 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌట్ అయింది.
