ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడిగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక నాగరాజు రిమాండ్ రిపోర్టు సంచలన నిజాలువెలుగులోకి వచ్చాయి.
ఈ కేసు కేవలం ఒక సాధారణ మిస్సింగ్ కేసు మాత్రమే కాదని, దీని వెనుక భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు ద్వారా ఈ వ్యవహారంలో సిఐ నాగరాజు పాత్రపై పూర్తి స్పష్టత వచ్చింది. బాధితుడు సాయికృష్ణకు సిఐ నాగరాజుకు మధ్య భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఒక సెటిల్మెంట్ వ్యవహారంలో సాయికృష్ణ పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో ఆయనపై సిఐ నాగరాజు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
డబ్బులు రాబట్టేందుకు సిఐ నాగరాజు తన అధికార పరిధిని దాటి ప్రవర్తించారని పోలీసులు గుర్తించారు. సాయికృష్ణను అక్రమంగా నిర్బంధించి, శారీరకంగా, మానసికంగా వేధించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ల్యాప్టాప్లు, సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లను బలవంతంగా లాక్కున్నట్లు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. సాయికృష్ణ అదృశ్యం కాగానే ఈ కేసు తనపైకి రాకుండా ఉండేందుకు సిఐ నాగరాజు సాంకేతిక ఆధారాలను, సీసీటీవీ ఫుటేజీలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని పోలీసులు నిర్ధారించారు. కేసు తీవ్రతను గమనించిన ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో సిఐ అసలు రంగు బయటపడింది.
శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి.. థర్డ్ పార్టీ సెటిల్మెంట్లలో తలదూర్చడం, ఒక వ్యక్తి అదృశ్యానికి కారణం కావడం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఉన్నతాధికారులు నాగరాజును సస్పెండ్ చేయగా కోర్టు రిమాండ్ రిపోర్టును పరిశీలించి ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
