భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగన మ్యాచ్లో ఒ చిన్న సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ 36 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో స్మిత్ పట్ల భారత అభిమానులు దురుసు ప్రవర్తన కెప్టెన్ విరాట్కు కోపం తెచ్చింది.
బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ను ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్, చీటర్’ అంటూ గేలి చేశారు. కొద్దిసేపు దీనిని గమనించిన కోహ్లి, హార్ధిక్ పాండ్యా వికెట్ పడ్డ సమయంలో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ… అలా ప్రవర్తించవద్దంటూ మందలించాడు. స్మిత్ కోసం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ.. తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. దీంతో భారత్ అభిమానుల తరుపున స్మిత్కు సారి చెప్పి తనలోని క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు కోహ్లీ.స్మిత్ సైతం కోహ్లీని భుజం తట్టి అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ విడుదల చేసింది.
మ్యాచ్ పూర్తయిన తరువాత మీడియాతో మాట్లాడిన కోహ్లీ, భారత అభిమానుల తరఫున తానే స్వయంగా స్టీవ్ స్మిత్ కు క్షమాపణలు చెప్పానని అన్నాడు. జరిగిందేదో జరిగిపోయిందని, అతను పునరాగమనం చేసి, దేశం కోసం పోరాడుతున్నాడని గుర్తు చేశాడు. స్మిత్ ను ఇలా గేలి చేయడం తాను చూశానని, ఒకరిని కించపరచడం మంచిది కాదని అన్నాడు. గతంలో తనకూ, స్మిత్ కు మధ్య విభేదాలు ఉండవచ్చని, వాదనలకు దిగుండవచ్చని, అయితే, అతని బాధ నుంచి వచ్చే ఆటను మాత్రం చూడాలని అనుకోవడం లేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
ఇక్కడ చాలా మంది భారత అభిమానులు ఉన్నారు. వారంతా ఓ చెత్త ఉదాహరణగా మిగిలిపోవద్దు. నేను స్మిత్ స్థానంలో ఉంటేనైతే చాలా బాధపడేవాడిని ఎందుకంటే.. అతను తప్పు చేశాడు. ఆ తప్పును అంగీకరించి క్షమాపణలు కోరాడు. దానికి శిక్షను కూడా అనుభవించాడు. అయినా మళ్లీ గేలి చేస్తే సహించడం ఎవరికైనా కష్టమే’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు.