భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడికి సెలక్టర్లు షాక్ ఇచ్చారు. క్రికెట్లో స్థానం సంపాదించాలంటే యో-యో టెస్ట్ ఖశ్చితంగా పాస్ అవ్వాల్సిందే. గత నెలలో బెంగళూరు వేదికగా జరిగిన యో-యో ఫిట్నెస్ టెస్టులో ఫెయిలై భారత జట్టులో చోటు కోల్పోయిన అంబటి రాయుడు.. తాజాగా ఆ టెస్టుకి గైర్హాజరైన కారణంగా భారత-ఎ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2018 ఐపీఎల్ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రాయుడిని ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టులోకి గత మే నెలలో సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. ఈ పర్యటన ముందు నిర్వహించిన యో-యో టెస్టులో ఈ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ విఫలమవడంతో.. జట్టు నుంచి తప్పించి సురేశ్ రైనాకి అవకాశం కల్పించారు.
ఆరు వారాల్లోపు మరోసారి ఫిట్నెస్ టెస్టుకి హాజరవ్వాలని బీసీసీఐ ఆదేశించింది. కానీ.. తాజాగా రాయుడు యో-యో టెస్టుకి గైర్హాజరవడంతో అతడ్ని భారత-ఎ జట్టుతో పాటు దిలీప్ ట్రోఫీ జట్లలోనూ స్థానంలో కల్పించలేదు. భారత జట్టులో ఆడాలంటే ఖటినమైన యో-యో టెస్ట్ను పాసవ్వాల్సిందే. యో-యో టెస్టుకి హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని అంబటి రాయుడు బీసీసీఐ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.