ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పై నిరసనల సెగ ఎక్కువయిపోతుంది.. సామాన్యుల నుంచి రాజకీయ నేతల దాకా నడిరోడ్డుపైకి వచ్చి నిరసనలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.. ఆ కోవలోనే సీతక్క ప్రభుత్వ విధానం పై నిన్న నిరసన వ్యక్తం చేస్తుండగా నిన్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.. కాంగ్రెస్ కిసాన్ సెల్ సమక్షంలో సీతక్క ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే కారు దిగిన సమయంలో తనపై చేయవేసిన మహిళా పోలీస్ను సీతక్క హెచ్చరించారు.
పోలీసుల తీరుపై మండిపడుతూ తనపై ఎందుకు చేయి వేశారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎమ్మెల్యే సీతక్క మధ్య తోపులాట జరగడంతో ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
రైతుల గురించి అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించలేదని, భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు. సభలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్దారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు.