నవ దంపతులకు టీటీడీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నూతన వధూవరులకు బహుమానాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నది. ఇంతకీ విషయం ఏమిటంటే.. పెళ్లి పత్రికను ముందుగా తమ కులదైవానికి లేదా ఇష్టదైవానికి తొలి శుభలేఖను ఇవ్వడం తెలుగు నాట వస్తున్న సంప్రదాయం. ఇందులో భాగంగా చాలా మంది తిరుమల శ్రీవారికి తొలి శుభలేఖను అందించి.. ఆతర్వాత శుభలేఖలను పంపుతుంటారు. ముఖ్యంగా తిరుపతి సమీప ప్రాంతాల వాళ్లు, వెంకటేశ్వరస్వామి భక్తులు కచ్చితంగా శుభలేఖలను స్వామివారికి అందిస్తారు.
అయితే ప్రస్తుత కరోనా టైంలో అది సాధ్యం కావడం లేదు. దర్శనాలు కొనసాగుతున్నప్పటికీ చాలా మంది తిరుపతి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇందుకోసం టీటీడీ ఓ అవకాశాన్ని కల్పించింది. శుభలేఖలను కొరియర్ ద్వారా పంపించే అవకాశం కల్పించింది. శుభలేఖలను ‘శ్రీ లార్డ్ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి’ చిరునామాకు పత్రిక కొరియర్ చేయవచ్చు.
ఇలా పంపించిన వారికి టీటీడీ బహుమానాలు కూడా అందిస్తోంది. వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్లి జరిగే రోజు తలంబ్రాల్లో కలుపుతారు) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతామని టీటీడీ ప్రకటించింది. ప్రస్తుతం చాలా మంది తిరుపతి వెళ్లేందుకు భయపడుతున్నారు. మరోవైపు కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందంటూ కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ వెల్లడించింది.
Also Read