ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడ 38వ డివిజన్ లో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ప్రజల వద్దకు వెళ్లి మెడికల్ కాలేజీల ఆవశ్యకతను వివరించి వారి వద్ద నుంచి సంతకాలు సేకరించారు మాజీ మంత్రి వెల్లంపల్లి.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ..ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణను రద్దు చేయాలని, ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజ్ లు నడపాలని ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించడం జరుగుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించవచ్చనే గొప్ప ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి 17 కాలేజీలకు శంకుస్థాపన చేశారు అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు, ఎన్నికల కోడ్ సమయంలో మరో రెండు కాలేజీలు నిర్మాణం పూర్తయ్యాయి, మిగిలిన కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి, కోట్ల రూపాయల విలువైన స్థలాలను ప్రైవేటీకరణ పేరుతో ధారాదత్తం చేసి డబ్బులు దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు నిలిపివేశాయి, మెరుగైన ఉచిత వైద్యం పేద ప్రజలకు అందాలంటే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధీనంలోనే నడవాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ రద్దు చేసేంత వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలు చేస్తాము అని తెలిపారు.
