ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నటి రాశికి క్షమాపణలు చెబుతూ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ భావోద్వేగ పోస్టు చేశారు. మూడేళ్ల క్రితం ఓ టీవీ షోలో రాశిపై తాను మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగ్ అంశం మరోసారి చర్చకు రావడంతో, దీనిపై స్పందించిన అనసూయ తన తప్పును అంగీకరించారు.
ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్న అనసూయ, “అప్పుడు నాకు తెలుగు భాషపై పూర్తి పట్టు లేకపోవడం వల్ల డైలాగ్ తీవ్రతను పూర్తిగా గ్రహించలేకపోయాను” అని పేర్కొన్నారు. ఆ డైలాగ్ను రాసి, డైరెక్ట్ చేసిన వ్యక్తులను అదే సమయంలో నిలదీసి ప్రశ్నించాల్సిందని, కానీ అప్పట్లో తనకు ఉన్న స్థితి, శక్తి అందుకు సహకరించలేదని ఆమె స్పష్టం చేశారు.
“ఇప్పుడు వెనక్కి వెళ్లి ఆ రోజున జరిగిన విషయాన్ని మార్చలేను. కానీ అది రాశికి బాధ కలిగించి ఉంటే, అందుకు నేను నిజంగా బాధపడుతున్నాను” అంటూ ఆమె క్షమాపణలు తెలిపారు. ఎవరినైనా అనుకోకుండా గాయపరిస్తే, దాన్ని సరిదిద్దుకునే బాధ్యత మనదేనని అనసూయ తన పోస్టులో పేర్కొన్నారు.
తన మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే, క్షమించమని కోరుతూ అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఆమె నిజాయితీని అభినందిస్తూ, ఇలాంటి బాధ్యతాయుత స్పందన మరింత గౌరవాన్ని తీసుకొస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

