తమిళనాడు రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసే పరిణామం చోటు చేసుకుంది. విజయ్కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో విచారణ కోసం ఈ నెల 15న హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లు సమాచారం.
కరూర్లో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనపై సీబీఐ ఇప్పటికే విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో భాగంగా టీవీకే పార్టీ చీఫ్ అయిన విజయ్ను అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. ఇప్పటికే రెండు సార్లు సీబీఐ విచారణకు హాజరైన విజయ్ నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులు పంపించారు. మొదట ఈరోజే విచారణకు రావాలని నిన్న నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో వెంటనే హాజరు కావడం సాధ్యంకాదని విజయ్ సీబీఐకి తెలియజేసినట్లు తెలుస్తోంది.
దీంతో విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలని విజయ్ అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లు సమాచారం.
ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందన్నది తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇక ఈ ఘటనపై టీవీకే పార్టీ వర్గాలు కూడా స్పందించే అవకాశముంది.
