ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ (DSC) చుట్టూ రాజకీయ ముఖచిత్రం వేడెక్కుతోంది. డీఎస్సీ అభ్యర్థుల ప్రతినిధి బృందం బుధవారం వైసీపీ(YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు, అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
మెరిట్ జాబితా రూపకల్పన, నార్మలైజేషన్ విధానం మరియు పోస్టుల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, దీనివల్ల ఎంతో కాలంగా కష్టపడి చదివిన అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అర్హులను పక్కన పెట్టారని ఆరోపించారు.
అభ్యర్థుల సమస్యలను నిశితంగా విన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి పూర్తి మద్దతు ప్రకటించారు. నిరుద్యోగుల జీవితాలతో మరియు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఇలాంటి అక్రమాలకు పాల్పడటం సరికాదని ఆయన మండిపడ్డారు.
మీ న్యాయ పోరాటాలకు వైయస్ఆర్సీపీ తోడుగా ఉంటుంది.. పార్టీకి చెందిన లీగల్ విభాగం మీకు సహాయపడుతుంది.. ఆ లీగల్ ఖర్చులను కూడా పార్టీనే భరిస్తుందని జగన్ భరోసా ఇచ్చారు. డీఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఇప్పటికే డిమాండ్ చేశాం.. 2029లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా రీ-ఎంక్వైరీ చేయిస్తామని హామీ ఇచ్చారు.
