తెలంగాణ సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ మల్టీజోన్-2 ఉపసంచాలకుడు (డెప్యూటీ డైరెక్టర్) సుంకరి నరహరిరావు అవినీతి బాగోతం బయటపడింది. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ జరిపిన సోదాల్లో రూ.1.54 కోట్ల నగదుతో పాటు రూ.100 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని బృందం మంగళవారం తెల్లవారుజామున రంగంలోకి దిగింది. నరహరిరావుకు చెందిన ఛత్రినాకలోని నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నారాయణగూడలోని ఆయన కార్యాలయంలో కూడా తనిఖీలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఛత్రినాకలోని ఇంటి పడకగదిలో ఉన్న కప్బోర్డును తనిఖీ చేయగా, అందులో ఐదు సంచుల్లో దాచిన రూ.1.54 కోట్ల నగదు బయటపడటంతో అధికారులు విస్తుపోయారు. ఏసీబీ చరిత్రలో ఒకే ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు.
అధికారిక రికార్డుల ప్రకారం ఇవి సుమారు రూ.13.05 కోట్ల ఆస్తులుగా కనిపిస్తున్నా, మార్కెట్ విలువ ప్రకారం ఇవి వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటాయని అంచనా. బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.5.04 కోట్లు ఉన్నట్లు గుర్తించి, ఆ ఖాతాలను స్తంభింపజేశారు. 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరంలో వ్యవసాయ భూమి, రంగారెడ్డి జిల్లాలో ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్లలో ఖరీదైన ఫ్లాట్లు, గచ్చిబౌలి, ఛత్రినాకలలో భారీ భవనాలు ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.
నరహరిరావు భార్య పేరిట రెండు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, బుధవారం వాటిని తెరిచి తనిఖీ చేయనున్నారు. సోదాల అనంతరం మంగళవారం సాయంత్రం నరహరిరావును అరెస్టు చేసిన ఏసీబీ బృందం, బుధవారం ఆయనను కోర్టులో హాజరుపరచనుంది.
