కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు జోధ్పూర్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించడంతో సల్మాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ కు జైలుశిక్షతో పాటు 10వేల రూపాయల జరిమానా విధించింది. కాగా జోధ్పూర్ కోర్టు తీర్పు నేపథ్యంలో కండలవీరుడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్ ఖాన్కు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. జింకలను క్రూరంగా వేటాడిన సల్మాన్కు గరిష్టంగా శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు
వాస్తవానికి ఈ కేసులో సల్మాన్ తో పాటు ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమాలో నటించిన సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీబింద్రే, నీలమ్ లు కూడా నిందితులుగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే విరామంలో వీళ్లు జింకలను వేటాడారు. కడదాకా వారు కూడా కోర్టు విచారణకు హాజరవుతూ వచ్చారు. అయితే వారి ప్రమేయంపై సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా విడిచిపెట్టింది న్యాయస్థానం. అయితే సల్మాన్ మాత్రం తప్పించుకోలేకపోయాడు. జోధ్పూర్ కోర్టు తీర్పును సల్మాన్ ఖాన్ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.
సల్మాన్ దోషి అని కోర్టు ప్రకటించగా.. చేసేది లేక తక్కువ శిక్షను విధించాలని సల్మాన్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. అయితే దానికి ఆయన నిరాకరిస్తూ, ఐదు సంవత్సరాల జైలు శిక్షను, పదివేల రూపాయల జరిమానాను విధించారు.