విజయవాడ రాజకీయాల్లో మరోసారి ‘కేశినేని’ బ్రదర్స్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లక్ష్యంగా మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కి కేశినేని నాని ఘాటుగా లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
కేశినేని చిన్ని కుటుంబంతో పాటు ‘కేసిరెడ్డి నెట్వర్క్’ ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరపాలని నాని డిమాండ్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వీరి వ్యాపారాలు, నెట్వర్క్లపై ఈడీ తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన తన లేఖలో కోరారు. చిన్ని అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దీని వెనుక పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.
ఎంపీ కేశినేని చిన్ని చట్టాన్ని, న్యాయస్థానాలను సైతం తప్పుదారి పట్టించారంటూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఈడీ అటాచ్మెంట్స్ (ఆస్తుల జప్తు) వివరాలను, బ్యాంకులకు సంబంధించిన కీలక ఆర్థిక విషయాలను దాచిపెట్టి, సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించేలా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటిపై లోతైన విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు.
కేశినేని చిన్నిపై కేవలం పాత వ్యాపార లావాదేవీలనే కాకుండా, ఇటీవల జరిగిన కార్యక్రమాలపైనా నాని ఆరోపణలు గుప్పించారు. ‘విజయవాడ ఉత్సవం’ పేరుతో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం మరియు స్కామ్కు పాల్పడ్డారని ఆయన ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అవినీతిపై కూడా దర్యాప్తు జరపాలని, ఈ అవినీతి నెట్వర్క్లో ఎంపీ పాత్రపై స్పష్టత రావాలని డిమాండ్ చేశారు.



