ఇండియాటుడే తాజా సర్వేలో సంచలన అంశాలు వెలుగు చూశాయి. ఏపీ ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందనేది స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రెండోసారి అధికారం కట్టబెట్టడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. బాబు పాలనై సంతృప్తి వ్యక్తం చేసినవాళ్ల కన్నా అంసతృప్తి వ్యక్తి చేసినవాళ్లే మూడు రెట్లు అధికంగా ఉన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని 38 శాతం మంది కోరుకుంటే, జగన్ ముఖ్యమంత్రి కావాలని 43 శాతం మంది కోరుకుంటున్నట్లు తేలింది.
అయితే ఎందుకు 43శాతం మంది జగన్ ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారని ఆద్య న్యూస్ ఆరా తీసింది. వివిధ వర్గాల ప్రజల ద్వారా గ్రౌండ్ రిపోర్ట్ సేకరించింది. ప్రజల మనసులో ఏముందో ? వారి నాడి తెలుసుకునేందుకు ప్రయత్నించింది. జగన్ పట్ల ఆకర్షితులవడానికి గల కారణాలను ఆద్య న్యూస్ అన్వేషించింది. ప్రధానంగా జగన్ పదే పదే చెబుతున్న ‘నవరత్నాలు’ అనే సంక్షేమ పథకాలపై ప్రజలు ఆలోచనలో పడ్డారు. వాటి అమలుతో తమకు మేలు జరుగుతుందని ఆశ పడుతున్నారు. అన్నివర్గాలకు మేలు జరిగేలా జగన్ ‘నవరత్నాలు’ పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పడంతో ప్రజలు కూడా వాటిపై ఫోకస్ పెట్టారు. ఆ ‘నవరత్నాలు’ వల్ల తమ కుటుంబంలో ఎవరికి ఎటువంటి లబ్ధి కలుగుతుంది ? ఎవరికి ఎలాంటి ప్రయోజనం లభిస్తుంది ? అనే చర్చలో పడ్డారు. ఓ సారి జగన్ కు అవకాశమిస్తే ఆయన చెబుతున్న ‘నవరత్నాలు’ పథకాల ద్వారా తమకు లబ్ధి చేకూరుతుందనే ఆశాభావంతో జగన్ సీఎం కావాలని కోరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
అసలేంటీ నవరత్నాలు ? ఎక్కడ నుంచి వచ్చాయి ? అనే ప్రశ్నలకు సమాధానాలు బీహార్ లో ఉన్నాయి. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ ‘సాత్ నిశ్చయ్’ (ఏడు నిర్ణయాలు). పేరుతో తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి పదే పదే ప్రచారం చేశారు. ఆర్జేడీ, జేడీయూ కూటమిగా ఏర్పడి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ‘ఏడు నిర్ణయాలు’ గురించి ఊదరగొట్టారు. ప్రజలను ఏడు వర్గాలుగా విభజించి, ఆయా వర్గాల వారీగా వారికి ఈ ఏడు నిర్ణయాలు ద్వారా లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల ప్రచారం చేశారు. దీంతో జనం ఆర్జేడీ, జేడీయూ కూటమికి మద్దతు తెలిపారు. ఫలితంగా 243 అసెంబ్లీ స్థానాలనున్న బీహార్ లో 178 స్థానాలతో ఆ కూటమి విజయం దక్కించుకుంది. కూటమి అభ్యర్ధిగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే అక్కడ నితీష్ వర్గానికి నాడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త హోదాలో ఈ ‘ఏడు నిర్ణయాలు’ ఆలోచన చెప్పి, ఆచరణలో పెట్టాడు. తర్వాత ప్రశాంత్ కిశోర్ వైఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యూహకర్త బాధ్యతలు చేపట్టాక ఆ ‘ఏడు నిర్ణయాలు’ మాదిరిగా ఏపీలో ‘నవరత్నాలు’ అమలు చేయాలని, పదే పదే వాటి గురించి మాట్లాడి, జనంలో ఆశతో పాటు నమ్మకాన్ని కలిగించాలని హితబోధ చేశాడు. దాన్ని జగన్ తుచ తప్పకుండా ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నాడు. దీంతో అతడికి ఆదరణ పెరిగిందనేది ఆద్య న్యూస్ సర్వేలో వెల్లడైంది. అందుకే జగన్ నోటి వెంట వస్తున్న ఆ ‘నవరత్నాలు’ ఆయనకు అధికారం తెచ్చిపెట్టే తారకమంత్రాలు అని స్పష్టమవుతోంది.