భారత్, రష్యా మధ్య ఆయుధ బంధం మరింత పెరిగింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కీలక ఒప్పందాలను ఇరు దేశాలు కుదుర్చుకోనున్నారు. ఒప్పందాల్లో ప్రధానమైనది ఎస్- 400 మిస్సైల్స్.
ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఎస్ 400 మిసైల్ను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. సుమారు 40 వేల కోట్లతో ఈ డిఫెన్స్ వ్యవస్థను భారత్ సొంతం చేసుకోనున్నది. ఈ ఒప్పందంలో భాగంగా రష్యాలోని సిబేరిలో భారత పర్యవేక్షణ కేంద్రాన్ని కూడా నిర్మిస్తారంటూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
19వ భారత్–రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదటి రోజు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. రెండోరోజు అత్యంత ముఖ్యమైన సమావేశం నిర్వహించారు.
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థపై ఒప్పందంతోపాటు రక్షణ రంగంలో సహకారం, ఇరాన్ నుంచి ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు, ఉగ్రవాదంపై పోరు, పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ, పుతిన్లు చర్చించినట్టు సమాచారం.
రష్యా వద్ద రక్షణ ఒప్పందాలను చేసుకోవడంతో భారత్కు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే రష్యా నుంచి ఎటువంటి ఆయుధాలను కొనుగోలు చేయరాదు అని అమెరికా హెచ్చరిస్తున్నా.. భారత్ మాత్రం తన పాత స్నేహితుడి నుంచే భారీ రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది.
రష్యాకు చెందిన రోసోబోరన్ ఎక్స్పోర్ట్ డైరక్టర్ జనరల్, భారత్కు చెందిన ల్యాండ్ సిస్టమ్స్ జాయింట్ సెక్రటరీ మధ్య ఎస్-400 డీల్ కుదిరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎస్-400 మిస్సైళ్లు మరో 24 నెలల్లో డెలివరీ కానున్నాయి. అంటే 2020లోగా మొత్తం అయిదు ఎస్-400లు రానున్నాయి.