సార్వత్రిక ఎన్నికల వేల ఏపీలో రాజకీయ పార్టీలు, నేతల మధ్య హాట్ హాట్ గా మాటల యుద్ధం సాగుతోంది. ఒక వైపు ఎన్నికల ప్రచారం మరో వైపు సామాజిక మాధ్యమాల్లో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. పదునైన వ్యాఖ్యలతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేన అధినేత పవన్ పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పావలా ప్యాకేజీ అంటూ ట్విట్టర్లో ఘాటుగా విమర్శలు చేశారు.
పవన్ కల్యాణ్ అమ్ముడుపోయిన వ్యక్తి అని విమర్శించారు. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు పవన్ కల్యాణ్ వచ్చాడని ఎద్దేవా చేశారు. ఉల్లిపాయ మీద పొట్టును కూడా తీయని పవన్ కల్యాణ్ తాటలు తీయడం కూడానా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్ 11 వరకు గంతులేసి వెళ్లు. నీ బతుక్కు తాటలు తీయడమొకటా? నీ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడు’ అని ట్వీట్ చేశారు.