నాకౌట్ చేరడమే లక్ష్యంగా బరిలో దిగిన ముంబయ్, హైదరాబాద్ రెండు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో రోహిత్ సేన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన హోరా హోరీ పోరులో 20 ఓవర్ల సమరంలో సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే ‘సూపర్ ఓవర్’ తేల్చేసిన ఫలితం హైదరాబాద్కు శరాఘాతమైంది. సూపర్ ఓవర్లో ముంబయ్ విజయం సాధించి ప్లేఆఫ్ బెర్త్ను కన్ఫమ్ చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (58 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. సన్రైజర్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 162 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమయ్యింది.
సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. నబీ సిక్స్ బాదడంతో 8 పరుగులు చేసింది. తొలి బంతికే మనీశ్ పాండే రనౌటవగా.. నాలుగో బంతికి నబీ బౌల్డయ్యాడు. దీంతో.. రెండు బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది . అనంతరం ఛేదనలో హార్దిక్ పాండ్య.. తొలి బంతినే సిక్స్గా మలిచి.. ఆ తర్వాత సింగిల్ తీయగా.. మూడో బంతికి పొలార్డ్ రెండు పరుగులు చేసి ముంబయిని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. ముంబయి తరఫున బుమ్రా సూపర్ ఓవర్లో బౌలింగ్ చేయగా.. హైదరాబాద్ టీమ్ నుంచి రషీద్ ఖాన్ బౌలింగ్ చేశాడు. రోహిత్ సేన ప్లేఆఫ్ బెర్త్ను కన్ఫమ్ చేసుకోగా హైదరాబాద్ సంక్లిష్టం చేసుకుంది.సూపర్ ఓవర్లో తెలివైన బౌలింగ్తో ముంబయిని గెలిపించిన బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.