టీమిండియా ప్రధాన పేస్ ఆయుధం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో జరుతున్న మ్యాచ్లో కరుణరత్నేను ఔట్ చేయడం ద్వారా బుమ్రా వందో వికెట్ను సాధించాడు. ఫలితంగా భారత్ తరఫున ఆ ఫీట్ను వేగవంతంగా సాధించిన రెండో బౌలర్ బుమ్రా గుర్తింపు పొందాడు. 57వ వన్డే మ్యాచ్లో బుమ్రా వందో వికెట్ మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో మహ్మద్ షమీ ఉన్నాడు. షమీ 56 వన్డేల్లో ఈ మార్కును చేరగా, బుమ్రా తర్వాత స్థానంలో నిలిచాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులను భారత బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులకు లంక ఓపెనర్ల వద్ద జవాబే లేకుండాపోయింది. బుమ్రా ధాటికి కెప్టెన్ దిముత్ కరుణరత్నే(10), కుశాల్ పెరెరా (18) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ కు క్యూకట్టారు. హార్దిక్ పాండ్య, జడేజా కూడా విజృంభించడంతో టాప్ ఆర్డర్ను పెవిలియన్ చేర్చి భారత్ను తిరుగులేని స్థితిలో నిలిపారు. 25 ఓవర్లకు లంక 4 వికెట్లకు 103రన్స్ చేసింది. మాథ్యూస్(26), తిరుమానె(23) పరుగులతో పోరాడుతున్నారు.