బీజేపీ నిర్ణయం అయితే తీసుకుంది కానీ… రాజధాని లేని నూతన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నూతనంగా నియామకమైన గవర్నర్ కోసం సకల సౌకర్యాలతో రాజ్ భవన్ లేని దుస్థితి నెలకొంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ఉండడం.. తాత్కాలికంగానే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులు ఉన్న సంగతి తెలిసిందే. నిలువనీడ లేని ఏపీలో గవర్నర్ ఉండడానికి కూడా సరైన భవనాలు లేవు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం గవర్నర్ ను నియమించి భారమంతా ఏపీ ప్రభుత్వంపై పడేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా చంద్రబాబు అస్త్రసన్యాసం చేసి అమరావతికి వచ్చేసి రాజధాని నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ పై హక్కులను కేసీఆర్ కే వదిలేశారు. అమరావతి ఇంకా కొనసాగుతూనే ఉంది. జగన్ రావడంతో ఇప్పుడు బ్రేక్ పడింది.
అయితే హడావుడిగా ఏపీ గవర్నర్ గా ఒడిషాకు చెందిన బీజేపీ వాది హరిచందన్ ను బీజేపీ సర్కారు నియమించింది. ఇప్పుడు ఆయనకు నివాస భవనాన్ని జగన్ సర్కారు ఎక్కడ కేటాయిస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది.
విజయవాడ బందర్ రోడ్ లోని ముఖ్యమంత్రిక్యాంప్ కార్యాలయాన్ని రాజ్ భవన్ గా మార్చేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత ఇరిగేషన్ శాఖకు చెందిన ఈ భవనాన్ని చంద్రబాబు కోసం సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చారు. ఆ తర్వాత హైకోర్టుగా మార్చారు. ఇప్పుడు గవర్నర్ కోసం దీన్నే వినియోగిస్తారా లేదా అన్నది చూడాలి. మొన్న గవర్నర్ నరసింహన్ ఏపీలో జగన్ ప్రమాణానికి వచ్చి హోటల్ లో బస చేశారు. మరి ఈ గవర్నర్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడన్నది తెలియాల్సి ఉంది.