స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్యారీ వ్యాన్ ప్రమాదానికి గురైంది. ఆంధ్రాలోని మారేడు మిల్లిలో లో షూటింగ్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణ పురం వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో క్యారీ వ్యాన్ వెనుక భాగం దెబ్బతిన్నది. ఈ ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ మినహా ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువాహనాలను స్టేషన్ కు తరలించారు.ప్రమాద సమయంలో కారులో అల్లు అర్జున్ లేరని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో అక్కడున్నవారు హీరోకు గాయాలు అయి ఉంటాయనుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మరో వైపు ఏజెన్సీ ఏరియాలో షూటింగ్ పూర్తయిందంటూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. ‘రంజచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో ‘పుష్ప’సినిమాకు సంబంధించి నవంబర్ 2020 నుంచి జనవరి 2021 మధ్య రెండు భారీ షెడ్యూల్స్ను పూర్తి చేశాం. సినిమా షూటింగ్కు సహకరించిన ఆదివాసీలు, అధికారులకు ధన్యవాదాలు. వారి సహకారం లేకుండా చిత్రీకరణ సజావుగా సాగేది కాదు. షూటింగ్ కోసం మళ్లీ ఇక్కడకు తప్పకుండా వస్తాం’అని చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో పేర్కొంది. సుకుమార్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఎర్రచందనం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.