బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణగడంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు బోయపాటి శ్రీను సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా చివరి షెడ్యూల్ రాయలసీమలోని పలు జిల్లాల్లో జరగనుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం, కడప జిల్లా గండికోట, కడప, చిత్తూరు జిల్లా పెనుమూరు చారిత్రక ప్రాంతాల్లో అఖండ ఆఖరి షెడ్యూల్ జరగనుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను చిత్ర యూనిట్ తో కలిసి చిత్తూరు జిల్లాలో పలు లొకేషన్లను పరిశీలిస్తున్నారు.
ఇందులో భాగంగా పెనుమూరు మండలంలోని పులిగుండు వద్ద ఉన్న పులిగుంటీశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ రాయలసీమలోని మూడు జిల్లాల్లో బాలకృష్ణపై ఓ పాట తో పాటు మరి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు చెప్పారు. దాదాపు ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు సాగుతుందని తెలిపారు. కాగా,అఖండ సినిమా వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది.
Also Read