తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 98 వ జయంతి నేడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి కళామ తల్లికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులు ఎన్టీఆర్. తెలుగు జాతి గర్వించదగ్గ నటుడిగా దశదిశలా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఎన్టీఆర్. సాంఘిక, పౌరాణిక,జానపద చిత్రాల్లో ఆయన వేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
ముఖ్యంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, రావణ బ్రహ్మ పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను భారత రత్న పురస్కారాన్ని ఇచ్చి తెలుగు జాతి గౌరవాన్ని పెంపొందించాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి.
ప్రముఖ గాయకుడు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లు మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావుగారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణమని చిరంజీవి పేర్కొన్నారు. నూరవ జయంతి దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.