జై లవకుశ’తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. జై.. లవ.. కుశగా మూడు పాత్రల్లో ఆయన అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా నత్తితో ‘జై’ పాత్ర పలికిన సంభాషణలు విశేషంగా అలరించాయి. తాజాగా ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదేనని అంటున్నారు. ప్రస్తుతం ఫస్టు షెడ్యూల్లో ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇందులో తారక్ ఎప్పుడూ చూడని గెటప్లో కన్పించబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొత్త లుక్ కోసం తారక్ జిమ్లో కష్టపడుతున్న ఫొటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది.
ఇక ఈ చిత్రం కోసం .. కళా దర్శకుడు ప్రకాష్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో రాయలసీమని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. రామ్లక్ష్మణ్ నేతృత్వంలో ఓ భారీ ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళా దర్శకుడు ఓ సెట్ని రూపొందించారు. ఈ సెట్ కోసం 3 నుంచి 4 కోట్ల వరకూ ఖర్చు అయినట్టుగా చెప్పుకుంటున్నారు.
ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనతో వున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, ఎన్టీఆర్ స్టైల్ తో .. త్రివిక్రమ్ మార్క్ తో కొనసాగుతుందని టాక్.
