దశాబ్దాల పాటు తన హాస్యంతో ప్రేక్షకులను నవ్వుల లోకంలో ముంచుతున్న హాస్యనటుడు బ్రహ్మానందం. ఇప్పుడు ఏమైందో ఏమోగానీ గత మూడేళ్లుగా సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. అడపదడప సినిమాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు అరుదైన గౌరవం లభించింది. కాకతీయ కళా పరిషత్ ‘హాస్యనట బ్రహ్మ’ అనే బిరుదును ప్రదానం చేసి ఆయన కళా సేవలకు ఘన సన్మానం చేసింది. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా నిలిచింది.
కాకతీయ లలిత కళా పరిషత్ ఛైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి ఆదివారం మహబూబ్నగర్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందానికి ‘హాస్యనట బ్రహ్మ’ పురస్కారంతో పాటు ఆయనను ఘనంగా సన్మానించారు. బ్రహ్మానందం నటనకు జీవం పోస్తారని, ఆయన ఓ జీనియస్ నటుడు అని కీర్తించారు. 1,100 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించిన గొప్ప నటుడు అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.