- ఎంసీఏ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు పోటెత్తిన అభిమానులు
స్టార్ హీరోల సరసన న్యాచురల్ స్టార్ నాని చేరడానికి ఇంకెన్నో రోజులు పట్టేట్టు లేదు. తాను చేస్తున్న సినిమాలన్నీ విజయాల బాట పడుతున్నాయి. ఫీల్ గుడ్ కథలతో తన సహజ నటనతో నాని సినిమాలను ఓ రేంజ్లోకి తీసుకొస్తున్నాడు. ఆ విధంగా ఈ ఏడాది మూడు హిట్ సినిమాలు కొట్టాడు. అయితే ఇప్పుడు మిడిల్ క్లాస్ అబ్బాయ్ (ఎంసీఏ) సినిమా డిసెంబర్ 21వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం (డిసెంబర్ 16) వరంగల్లోని హన్మకొండలో నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్కు అభిమానులు, ప్రేక్షకులు పోటెత్తారు. దాదాపు 30 వేల మంది హాజరయ్యారు. ఇంతమందిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలకు మించిన ప్రాణంగా మారింది. దీంతో చిత్ర నిర్మాత్ దిల్ రాజు స్పందిస్తూ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరంగల్లోని హన్మకొండలో పెద్ద సంఖ్యలో యువత రావడంతో వారిని కంట్రోల్ చేయలేకపోయారు. వరంగల్ లాంటి చోట ఇలాంటి వేడుకలు జరగడం అరుదు కదా. నాని, సాయిపల్లవి, దిల్ రాజు లాంటి వాళ్లను చూసేసరికి ప్రేక్షకులు ఆగలేదు. వేదిక పైకి దూసుకొచ్చారు.
నిర్మాత దిల్ రాజు చాలాసార్లు హెచ్చరించాడు. ‘‘ఏరా బై చెబితే అర్థం కాదా..’’ అంటూ అరిచారు. ‘‘మీరిలా చేస్తే ఇకపై వరంగల్లో ఇలాంటి ఫంక్షన్ ఉండవు. షూటింగులు కూడా ఉండవు. ఎవరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడరు’’ అని హెచ్చరించారు. అయినా ప్రేక్షకులు తగ్గకుండా వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ పోయారు. అయితే ఆ తర్వాత నాని అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దిల్ రాజు హెచ్చరికలను కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ‘‘రాజు గారు అలా అంటారు కానీ.. హైదరాబాద్ నుంచి మేం ఇక్కడికి వచ్చింది మీరు సైలెంటుగా ఉంటే చూడటానికా.. మీరు కానివ్వండి’’ అని కొంచెం ప్రోత్సహించారు.
ఇక కార్యక్రమం ముగిసిన అనంతరం నానిని చూడడానికి వేదికపైకి నానిని తెగ ఇబ్బంది పెట్టారు. అయినా నాని సహనంతో అభిమానులను పలకరించాడు.