దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ విషయంలో ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్కు ధీటుగా 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ జీవిత కథ ఆధారంగా సినిమాను రూపొందింస్తున్నారు దర్శకుడు మహీ వి రాఘవ్ . ఈ సినిమాలో వైఎస్ గా నటింపజేయడానికి ఈ దర్శకుడు పలువురు స్టార్ హీరోలను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. అక్కినేని నాగార్జున, మమ్ముట్టీ వంటి హీరోలతో సంప్రదింపులు జరిగాయని.. మమ్ముట్టీ ఇందులో నటించడానికి ఓకే చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.
ఇంకో అడుగు ముందుకేసి వైఎస్ఆర్గా మమ్ముట్టి, విజయమ్మగా నయనతారా ఎంపికైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయం గురించి ఆయన స్పందించాడు. ఈ సినిమా కోసం ఇంకా ఎవరినీ సంప్రదించలేదనీ .. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక నటీనటుల ఎంపిక మొదలుపెడతామని అన్నాడు. విజయ్ చిల్లా .. శశీదేవి నిర్మిస్తోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పాడు.