రొటీన్ కథలకు దూరంగా ఉంటూ సరికొత్త కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న రానా ఇప్పుడు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ సినిమా తెరకెక్కనుంది అని గత కొంతకాలంగా పుకార్లు బయటకు వస్తున్నాయి. తాజాగా దీని గురించి అధికారిక ప్రకటన ను స్వయంగా గుణశేఖర్ విడుదల చేశారు. తాను ‘హిరణ్యకశ్యప’ అనే ఒక పౌరాణిక సినిమా మీద పని చేస్తున్నానని, అందులో రానా హీరోగా నటిస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేశారు గుణశేఖర్.
‘చూడాలని ఉంది’, ‘ఒక్కడు’, ‘అర్జున్’ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన గుణశేఖర్ 2015 లో ‘రుద్రమదేవి’ సినిమాకు దర్శకత్వం వహించారు. మళ్లీ ఇన్నాళ్లకు రానా హీరోగా మరొక సినిమా తో మన ముందుకు రాబోతున్నారు. గత మూడేళ్లుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుతున్నాను అని గుణశేఖర్ వెల్లడించడం గమనార్హం. ఇక ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయని కూడా ఆయన ప్రకటించారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి హిరణ్యకశిపుని పాత్రలో కనిపించబోతున్నాడు.